800 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురి దుర్మరణం

  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
  • దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ సప్తశృంగి మాత ఆలయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 800 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

పటేల్ కుటుంబ సభ్యులు ఆలయ దర్శనానికి కారులో బయల్దేరారు. భవారీ జలపాతం సమీపంలోని ఘాట్ రోడ్డులో ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మార్గంలో రహదారి చాలా ఇరుకుగా, ప్రమాదకరమైన మలుపులతో ఉంటుంది. అదుపుతప్పిన కారు రోడ్డు అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను కీర్తి పటేల్ (50), రసిలా పటేల్ (50), విఠల్ పటేల్ (65), లతా పటేల్ (60), పచన్ పటేల్ (60), మణిబెన్ పటేల్ (60)గా పోలీసులు గుర్తించారు. వీరంతా దగ్గరి బంధువులు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, లోయ చాలా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోవైపు, రహదారి నిర్వహణ లోపం, భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Saptashrungi Mata Temple
Maharashtra road accident
Nashik car accident
Saptashrungi temple accident
Patel family accident
India road accident
road accident news
Narendra Modi

More Telugu News